అమరావతి : ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్ మోహన్రెడ్డి న్యాయం చేస్తారని నమ్మకం ఉందని ఏపీ ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు విశ్వాసం ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం సీఎంతో జరుపనున్న సమావేశం సందర్భంగా జాయింట్ కౌన్సిల్ స్టాఫ్ సంఘాల ప్రతినిధులు మరోమారు సమావేశమై చర్చించారు. ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. జాయింట్ కౌన్సిల్ సమావేశంలో పీఆర్సీ ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ, సీసీఎల్, పెన్షన్స్ తదితర వాటిపై చర్చిస్తామని వెల్లడించారు. అయితే పీఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయొద్దని కోరతామని స్పష్టం చేశారు.
సీఎంతో జరిగే సమావేశంలో తమకు సంతృప్తికరంగానే నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నామని ఆశభావం వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా ఉద్యోగుల ఆందోళనలకు సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నామని , తమకు మంచి పీఆర్సీ ఇస్తారని విశ్వాసం ఉందని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నామని వారు తెలిపారు.