అమరావతి : వారంతా రోజువారి కూలీలు, చిరువ్యాపారులు. రేయనక, పగలనక కష్టించి కూడబెడుతున్న
డబ్బును ఓ వార్డు వాలంటీరును నమ్మి జమ చేసుకుంటున్నారు. ఇలా ఆమె వద్ద సుమారు 2వేల మంది జమ
చేసుకున్న 3 కోట్ల రూపాయలతో ఉడాయించిన సంఘటన ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు కన్నీటపర్యంతమయ్యారు.
ఈ సంఘటన విజయనగరం జిల్లా సాలూరు పట్టణం చిట్లువీధిలో జరిగింది. వార్డు వాలంటీరు మానాపురం రమ్య , ఆమె తల్లి అరుణ పొదుపు, చీటీల పేరుతో 15 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నారు. కొంత సొమ్ము చెల్లిస్తే ఎక్కువ వడ్డీ ఇస్తామనడంతో ఆమెను నమ్మి రోజు, వారం, నెల వారీగా డబ్బును జమ చేసుకుంటున్నారు.
బాధితులకు డిసెంబర్ నెలలో కొంత మందికి డబ్బులు చెల్లించాల్సి ఉండగా అప్పటి నుంచి వాయిదా వేసుకుంటూ వస్తున్న తల్లీకూతుళ్లు పదిరోజుల క్రితం పెళ్లికి వెళ్తున్నామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి తిరిగి రాలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఆందోళనకు గురై తమకు న్యాయం చేయాలని అధికారులను, పోలీసులను కోరుతున్నారు.