Vijayawada | విజయవాడలో ఓ దుండగుడు ఏకంగా పోలీసులపైనే కాల్పులకు యత్నించాడు. బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో శనివారం ఉదయం ఈగల్ టీమ్తో కలిసి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని పట్టుకునేందుకు వెళ్లగా.. అకస్మాత్తుగా తన వద్ద ఉన్న తుపాకీతో పోలీసు అధికారులపై కాల్పులు జరిపేందుకు యత్నించాడు. ఆ సమయంలో సదరు వ్యక్తి ట్రిగ్గర్ నొక్కినప్పటికీ.. టెక్నికల్ లోపం కారణంగా బుల్లెట్ చాంబర్లోకి రాలేదు. దీంతో అధికారులు తప్పించుకున్నారు.
కాల్పులు విఫలం కావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. నిందితుడిని తెలంగాణలోని వరంగల్ జిల్లా నెల్లికుదురు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడి నుంచి 9ఎంఎం పిస్టల్, ఐదు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని విజయవాడ టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తరలించారు.