విశాఖ: ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు చేపట్టిన ‘జైల్ భరో’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు ర్యాలీ చేపట్టిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని గాజువాక పోలీస్ స్టేషన్కు తరలించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావం తెలుపుతూ నటుడు ఆర్ నారాయణమూర్తి ర్యాలీలో పాల్గొన్నాడు.
ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి వార్షిక కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా కార్మికులు ఆదివారం ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని చేపట్టారు. కూర్మన్నపాలెం ఆర్చ్ నుంచి గాజువాక వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి డిమాండ్ చేసింది.
కార్మికుల ర్యాలీతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు కార్మికులను అరెస్టు చేసి గాజువాక స్టేషన్కు తరలించారు. విశాఖ ఉక్కు కర్మాగారం వాటాలను విక్రయించి ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం గతేడాది నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా కేంద్రానికి లేఖ రాశారు. అయితే, ఉక్కును ప్రైవేటీకరించే ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ముందుకే సాగుతున్నది. ఆందోళనలకు ఏడాది పూర్తికావడంతో కార్మికులు నిరసనకు దిగారు.