Tirumala | తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు, వారాంతపు సెలవులు కావడంతో గత నాలుగు రోజుల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు కిలో మీటర్ల మేర బారులు తీరుతున్నారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో భక్తుల రద్దీ ఉన్నా.. స్వామి వారిని దర్శించుకునే సమయం తగ్గనుంది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మార్చిలో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసింది. అయితే, రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల జారీకి అనుమతించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని టీటీడీ కోరింది. అయితే, ఈ నిర్ణయానికి ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. దీంతో మంగళవారం నుంచి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను అనుమతిస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యులకు గతంలో తరహాలోనే రోజుకు పది వీఐపీ బ్రేక్, పది రూ.300 ఎస్ఈడీ టికెట్లు జారీ చేస్తున్నారు. అలాగే ఎంపీలకు 12, ఎమ్మెల్యేలకు ఆరు చొప్పున వీఐపీ బ్రేక్ టికెట్లను సిఫార్సు లేఖలను జారీ చేస్తున్నారు. ఈ సిఫార్సు లేఖలతో స్వామి వారి దర్శనానికి తక్కువ సమయం పట్టనుంది.