తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah naidu) దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరుకున్న వెంకయ్యనాయుడికి.. మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు ఉపరాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించారు. ఆలయ ఈవో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్వామి దర్శనంతో లభించిన సంతృప్తి, సంతోషంతో ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం లభిస్తుందని భావిస్తున్నాని చెప్పారు. తిరుమలకు ఎన్నిసార్లు వచ్చినా నిత్యనూతన ఉత్సాహం, స్ఫూర్తి కలుగుతుందన్నారు. శ్రీవారిని దర్శించుకున్న తరువాత వచ్చే ఆనందం ప్రతి ఒక్కరు పొందాలని ఆయన కోరారు. హిందూ ధర్మ పరిరక్షణ, భారతీయ సాంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు. భక్తుల కోసం టీటీడీ చేపట్టిన ఏర్పాట్లపట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఏడాదికి ఒకసారి మాత్రమే స్వామి వారిని దర్శించుకోవాలని ఆయన కోరారు. అలా చేయడం వల్ల అందరికి శ్రీవారి దర్శన భాగ్యం లభించే అవకాశం ఉంటుందన్నారు. ఈ విధానాన్ని తాను పాటిస్తున్నట్లు చెప్పారు. తన మనవరాలు సుష్మ వివాహానికి హాజరవ్వడానికి తిరుమల వచ్చామని, కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు పుష్పగిరి మఠంలో సాదాసీదీగా తన వివాహం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.