తిరుపతి : తిరుపతి రూరల్ మండలం పేరూరు వద్ద పునర్నిర్మిస్తున్న శ్రీ వకుళ మాత ఆలయాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. జూన్ 23వ తేదీన జరిగే ఆలయ మహాసంప్రోక్షణ లో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని ఆయన తెలిపారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డితో కలసి వకుళ మాత ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై వీరిద్దరూ అధికారులకు సూచనలు, సలహాలు చేశారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో వకుళ మాత ఆలయ పునర్నిర్మాణం లో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా ఆలయ పునర్నిర్మాణానికి ఆదేశాలు జారీచేశారని చెప్పారు. ఆలయాన్ని రాష్ట్రంలోని ముఖ్య ఆలయాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని మంత్రి వివరించారు.
ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి తో పాటు శ్రీ వకుళ మాతను కూడా దర్శించుకునేలా ఏర్పాటు, ప్రచారం చేస్తామని చెప్పారు.ఇక్కడ ఉద్యాన వనాలు అభివృద్ధి చేయడం తో పాటు మొక్కలు పెంచుతామని, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు.