తిరుమల : తిరుమలలోని శ్రీవారిని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి సన్మానించి జ్ఞాపికను అందజేశారు.స్వామివారిని దర్శించుకునేందుకు నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న కేంద్ర మంత్రికి తిరుపతి నగర మేయర్ డాక్టర్ ఆర్ శిరిషా జ్ఞాపికను అందజేశారు. తిరుపతి నగర అభివృద్ధికి రూ. 200 కోట్లను మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు.
సెలవుల కారణంగా గత పది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. సర్వ దర్శనానికి ఎక్కువ సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. సర్వదర్శన స్లాటెడ్ విధానాన్ని పునరుద్దరిస్తామని పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో ఎన్నడు లేన్నంతగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలి వచ్చారు. నిన్న 89, 318 మంది శ్రీవారిని దర్శించుకోగా 48,539 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.76 కోట్లు వచ్చిందని తెలిపారు.
సర్వదర్శనానికి 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, వీరికి దర్శనానికి 10 గంటల సమయం పడుతుందని వెల్లడించారు.అయితే అధికారులు ప్రకటిస్తున్న దానికి భిన్నంగా దాదాపు 36 గంటలకు పైగా దర్శనం లభించడం లేదని భక్తులు వాపోతున్నారు.