Petrol Rates | న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. పెట్రోల్ ధరల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలవగా, డీజిల్ రేట్లలో లక్షద్వీప్ తొలి స్థానంలో నిలిచింది. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.87 గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. లక్షద్వీప్లో లీటర్ డీజిల్ ధర రూ. 103. 08గా ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.78 గా ఉంది.
పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను దేశమంతా ఒకే ధరల విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉందా? అని రాజస్థాన్కు చెందిన బీజేపీ ఎంపీ రాహుల్ కశ్వాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఒకే చమురు ధరల విధానం ఇప్పటి వరకు లేదన్న ఆయన.. ఆయా రాష్ట్రాల్లో పన్ను ఆధారంగా ధరలు ఉన్నట్టు తెలిపారు.
ఇందులో భాగంగా జులై 18వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల రాజధాని నగరాలు, ముఖ్య పట్టణాల్లో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరల వివరాలను కేంద్రం వెల్లడించింది. ఏపీ కంటే తెలంగాణలోనే పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66 కాగా, డీజిల్ ధర రూ. 97.82గా ఉంది. కేరళ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.73 కాగా, డీజిల్ ధర రూ. 98.53గా ఉంది.