కర్నూలు: జిల్లా జైలు కాంపౌండ్ వాల్ దూకి అండర్ ట్రయిల్ ఖైదీ పరారయ్యాడు. గత నెల 16న జరిగిన హత్య కేసులో నాని అనే వ్యక్తి నిందితుడిగా పేర్కొన్న పోలీసులు.. అరెస్ట్ చేసి పంచలింగాలలోని జిల్లా జైలుకు తరలించారు. కాగా, అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న నాని శనివారం పారిపోయాడని జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఒకవైపు దర్యాప్తు ప్రారంభించగానే.. మరోవైపు పారిపోయిన ఖైదీ తిరిగి ఉదయానికల్లా జైలులో ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆశ్చర్యపోవడం జైలు అధికారుల వంతైంది.
వివరాలిలా ఉన్నాయి. కుల్లాయి అలియాస్ నాని అనే వ్యక్తి గత నెలలో ఓ హత్య కేసులో అరెస్ట్ అయి జిల్లా జైలులో ఉంటున్నాడు. అయితే శనివారం పోలీసుల కళ్లుగప్పి జైలు నుంచి పారిపోయాడు. ఆదివారం ఉదయం జైలు అధికారులు కొద్దిసేపు ఖైదీలను బ్యారక్ నుంచి బయటకు పంపించారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న నాని.. అత్యంత కట్టుదిట్టమైన కాంపౌండ్ వాల్ దూకి తప్పించుకున్నాడు. నాని పారిపోయిన విషయాన్ని జిల్లా జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు మొదలెట్టారు.
అయితే, పారిపోయిన నాని తిరిగి ఆదివారం ఉదయాన్నే అదే జైలుకు తిరిగి వచ్చేశాడు. దాంతో ఆశ్చర్యపోవడం జైలు సిబ్బంది వంతైంది. ఎలా పారిపోయాడు..? ఎందుకు తిరిగి వచ్చాడు..? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉన్నది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జైళ్ల శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టనున్నట్లు తెలిసింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో కొందరు జైలు అధికారులపై వేటు పడే అవకాశముందని తెలుస్తున్నది.