అమరావతి : అమర్నాథ్ యాత్రకు వెళ్లిన భక్తుల్లో ఏపీకి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. వీరిలో రాజమండ్రికి చెందిన గుడిమెట్ల సుధ, మరొకరు పార్వతిగా గుర్తించారు. యాత్రలో భాగంగా ఏపీ నుంచి సుమారు 84 మంది అమర్నాథ్ యాత్రకు చేరుకున్నారు. మార్గమధ్యలో విడిదిలో ఉండగా ఒక్కసారిగా వరద ప్రవాహంతో విడిదిలో ఉన్న వారు చెల్లచెదురు కాగా దేశం నలుమూలలకు చెందిన 18 మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు గల్లంతయ్యారు.
రెస్క్యూటీంకు లభించిన మృతదేహాలను శ్రీనగర్కు తరలించగా తీవ్రంగా గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రితో పాటు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా మృతుల వివరాలు తెలుసుకునేందుకు ఏపీ అధికారులు ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక హెల్ప్లైన్ను ఏర్పాటు చేశారు. హెల్ప్లైన్ నుంచి అందుతున్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన కుటుంబ సభ్యులకు తమవారి ఆచూకిని కనుగొంటున్నారు.
ఇవాళ శ్రీనగర్ ఆస్పత్రిలో రాజమండ్రికి చెందిన గుడిమెట్ల సుధ మృతదేహాన్ని ఆమె భర్త విజయ్ కిరణ్ గుర్తించారు. అదేవిధంగా పార్వతి మృతదేహాన్ని ఎయిమ్స్లో గుర్తించి కుటుంబ సభ్యులకు సహచరులు సమాచారం అందించారు.