Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని తిలకించేందుకు సుమారు రెండు లక్షల మంది భక్తులతో పుర వీధులు కిటకిటలాడాయి. శ్రీభ్రమరాంబ మల్లికార్జునుల కళ్యాణమహోత్సవం తర్వాత రథంపై అధిష్టించి క్షేత్ర పురవీధుల్లో ఊరేగించడం ఆనవాయితీగా వస్తుందని ఈవో పెద్దిరాజు, ధర్మకర్తల మండలి ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి చెప్పారు.
శనివారం సాయంత్రం అర్చకవేదపండితులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంగళవాయిద్యాలు, ఢమరుకనాదాలతో అశేష జనవాహిని మధ్య రథోత్సవం వైభవంగా సాగింది. రథోత్సవానికి ముందుగా ఆలయ ప్రాంగణం నుంచి స్వామిఅమ్మవార ఉత్సవమూర్తులను పల్లకిలో తోడుకుని వచ్చారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం రథాంగపూజ, హోమం, రథాంగబలి కార్యక్రమంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి స్వామి అమ్మవార్లకు సాత్వికబలి సమర్పించారు. ఈ రథోత్సవాన్ని వీక్షించడంతో సర్వపాపాలు కష్టాలు తొలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. ఉగాది మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని వీక్షించేందుకు రెండు రోజులుగా వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన భక్తులు సుమారు రెండు లక్ష మంది వరకు వేచి ఉన్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామిఅమ్మవార్లకు ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవాన్ని నయనానందకరంగా జరిపించారు. ఆధునిక సాంకేతికతతో కూడిన విద్యుద్దీపాలంకరణ, సౌండ్ సిస్టమ్, వాటర్ ఫౌంటెయిన్లను వీక్షించిన యాత్రికులు సెల్ఫీలతో హడావుడి చేశారు. అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక పూజలందుకున్న స్వామిఅమ్మవార్లను ఆలయ పుష్కరిణి వద్దకు తోడ్కొనివచ్చి పుష్పాలంకరణ చేసిన తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.