Srisailam | శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో లోక క్షేమాన్ని కాంక్షిస్తూ మంగళవారం శాస్త్రోక్తంగా పరివార దేవుళ్లకు వార పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న కుమార స్వామికి మంగళవారం ఉదయం షోడషోపచార పూజాది క్రతువులు చేశారు. సాయంకాలం క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాలంలో అభిషేకార్చన జరిపించారు. ఆరు బయట ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చే స్వామికి ఉదక స్నానం చేయించి విశేష పుష్పార్చన చేశారు. అటుపై అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అంద చేశారు.
సంధ్యా సమయంలో నందిమండపం వద్ద కొలువైన శనగలబసవన్నకు ప్రత్యేక క్రతువులు నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో బాసిల్లాలని అర్చకపండితులు మహా సంకల్పాన్ని పఠించారు. పంచామృతాలు ఫలోదకాలతోపాటు మల్లికాగుండంలోని శుద్దజలంతో అభిషేకం చేశారు. అనంతరం నందీశ్వరునిపై స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను అధిష్టించి అష్టోత్తర శతనామ పూజలు జరిపారు. నూతన వస్ర్తాన్ని సమర్పించి నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పించారు.
శ్రీశైలం ప్రధాన వీధిలోని దుకాణాలు గడువు తేదీలోపు ఖాళీ చెయ్యాలని విధించిన ఆంక్షలు ఖచ్చితంగా అమలుపరుస్తామని దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. ఆలయ అభివృద్ది దృష్ట్యా ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ దేవస్థానాన్ని నష్టపరిచేలా వ్యాపారులు వ్యవహరించడం సరి కాదని అన్నారు. ప్రధానవీధిలో గల 24 షాపులు నూతన వాణిజ్య సముదాయానికి తరలించకుండా అశ్రద్ద వహించారు. దీంతో ఆయా షాపులకు విద్యుత్ సరఫరా మరియు మంచినీటి కనెక్షన్లను మంగళవారం ఇంజనీరింగ్, రెవిన్యూ అధికారులు నిలిపివేశారు. డిప్ ద్వారా కేటాయించిన షాపులు కూడా నిర్ణీత సమయంలో దుకాణాలు బదిలీ చేయ్యాలని సూచించారు. దేవస్థానం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నట్లు కర్నూల్ జిల్లా టూరిజంశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 26 న మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం చేరుకుంటారు. స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకోనున్నారు. అదే విధంగా క్షేత్ర పరిధిలో కేంద్ర ప్రభుత్వ నిధులను వెచ్చించి ప్రసాదం పథకం క్రింద భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. తిరిగి మధ్యాహ్నం 12:45 గంటలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారని అధికారులు తెలిపారు.