TTD Arjita Seva Tickets | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన మార్చి నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ 18 నుంచి 20 వరకు ఉంటుందని.. ఆసక్తి ఉన్న భక్తులు పేర్లను నమోదు చేసుకోవాలని చెప్పింది. 20న లక్కీ డీప్ ఉంటుందని.. టికెట్లు పొందిన భక్తులంతా ఈ నెల 22 మధ్యాహ్నం 12 గంటల లోపుగా సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయని చెప్పింది.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని చెప్పింది. అలాగే, వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చెప్పింది.
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మార్చి నెల ఆన్లైన్ కోటాను 23న ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. అలాగే, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచితంగా ప్రత్యేక దర్శనం కోటా టికెట్లు ఇస్తున్నది. ఈ కోటా టికెట్లను 23న మధ్యాహ్నం 3గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని చెప్పింది.
మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది.
తిరుమల, తిరుపతిలలో మార్చి నెల గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పింది. ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని.. ఈ మేరకు భక్తులంతా గమనించాలని కోరింది.