(TTD on Darshan) తిరుమల: సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని చర్యలు చేపట్టింది. జనవరి ఒకటో తేదీన నూతన ఆంగ్ల సంవత్సరం రోజున, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 13 నుంచి 22 వరకు సిఫార్సు లేఖలను అనుమతించొద్దని టీటీడీ నిర్ణయించింది. ఈ రోజుల్లో స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్ వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పని సరిగా తీసుకురావాలని టీటీడీ సూచిస్తున్నది.
శ్రీవారి ఆలయంలో జనవరి 13న వైకుంఠ ఏకాదశి, జనవరి 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపడుతున్నది. జనవరి 13 నుంచి 22 వరకు మొత్తం 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. జనవరి 11 నుంచి 14 వరకు వసతి గదుల ఆడ్వాన్స్ రిజర్వేషన్ను కూడా టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల వసతికి పెద్దపీట వేయనున్నారు. తిరుమలలోని అన్ని గదులను కరెంటు బుకింగ్ ద్వారా మాత్రమే కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. జనవరి 11 నుంచి 14 వరకు దాతలకు గదుల కేటాయింపు ప్రివిలేజ్ ఉండదని స్పష్టం చేసింది. కాగా, అన్నప్రసాద భవనంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ 10 రోజుల పాటు ఉదయం 4 నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేపట్టనున్నారు.
పర్వదినాల్లోనే కాకుండా మిగతా అన్ని రోజుల్లోనూ స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు విధిగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా అందజేయాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కాగా, భక్తులకు వైద్యసేవలందించేందుకు అవసరమైన ప్రాంతాల్లో వైద్య బృందాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..