TTD | భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ కోటాలో శ్రీవారి ఆర్జిత సేవ, దర్శన టికెట్లను బుక్ చేసుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రతి నెల 18-20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. ఈ లక్కీడిప్లో టికెట్లు పొందిన భక్తులు.. 20 నుంచి 22వ తేదీ మధ్యలో సొమ్ము చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకర సేవలతో పాటు వర్చువల్ సేవా టికెట్లను ప్రతి నెల 21న విడుదల చేయనున్నారు. శ్రీవాణి, అంగప్రదక్షిణం, వృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు ప్రతి నెల 23వ తేదీన, అదే విధంగా రూ. 300 దర్శన టికెట్ల కోటాను ప్రతి నెల 24న, తిరుపతిలో గదుల కోటాను ప్రతి నెల 25న, తిరుమలలో గదుల కోటాను ప్రతి నెల 26న విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాలన్నింటినీ గమనించి సేవా, దర్శన, గదులకు టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.