హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తిరుమల పుణ్యక్షేత్రంలో 2024, మార్చి నెలకు సంబంధించి రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శనం, వసతి గదుల టికెట్ల కోటాను టీటీడీ అధికారులు ఈ నెల 25న విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల టికెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయి.
వచ్చే మార్చి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్స్ డిప్ రిజిస్ట్రేషన్ సోమవారం.. అంటే రేపు ఓపెన్ అవుతుంది. ఈ నెల 18న ఉదయం 10 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఇది అందుబాటులో ఉంటుంది. శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల్లో పాల్గొనే భక్తుల టికెట్ల బుకింగ్ 21న ఉదయం 10 గంటలకు ఆరంభమవుతుంది. తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు 23న ఉదయం 10 గంటలకు ఓపెన్ కానుండగా.. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా బుకింగ్ అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతాయి. శ్రీవాణి ట్రస్ట్ దాతల కోసం కేటాయించిన దర్శనం, వసతి గదుల కోటా 23న ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయి.
ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని టీటీడీ తెలిపింది. ఈ విశేష దినాల్లో ప్రొటోకాల్ వీఐపీలకు పరిమితంగా బ్రేక్ దర్శనం కల్పించనున్నామని వెల్లడించింది. సిఫారసు లేఖలను స్వీకరించమని స్పష్టం చేసింది.