తిరుపతి: గో సంరక్షణ, గోశాలల నిర్వహణతో పాటు గో ఆధారిత వ్యవసాయం, పంచగవ్య ఉత్పత్తుల వాడకం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి జరిగే మేలు గురించి ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని నోడల్ గోశాలల నిర్వాహకులకు టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సూచించారు. ఇందుకోసం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేస్తామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాకు రెండు చొప్పున ఎంపిక చేసిన నోడల్ గోశాలల నిర్వాహకులతో శనివారం ఆయన వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు తమ సమస్యలు, గో ఆధారిత వ్యవసాయంలోని ఇబ్బందులు, మార్కెటింగ్, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి అంశాలను ఈవో దృష్టికి తీసుకువచ్చారు.
రాష్ట్రంలోని గోశాలలను స్వయం సంవృధ్ధిగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈవో జవహర్రెడ్డి తెలిపారు. పాలిచ్చే ఆవుల సంఖ్యను పెంచుకోవడం, పాలివ్వని గోవులను గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులకు అందించడం వంటి ఏర్పాట్లు జరగాలన్నారు. ఇందులోభాగంగా టీటీడీ గోఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులకు 1300 గోవులు, ఎద్దులు ఉచితంగా ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర రైతు సాధికారిక సంస్థతో ఒప్పందం చేసుకుని గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన పంట ఉత్పత్తులను తిరుమలలో శ్రీవారి ప్రసాదాల తయారీకి సేకరిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అన్నదానంకు అవసరమైన బియ్యం, బెల్లం, సెనగలు వంటి ఉత్పత్తులు కూడా సేకరించి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఆయన తెలిపారు.
దేవాదాయ శాఖ కమిషనర్తో చర్చించి రాష్ట్రంలోని అన్ని పెద్ద దేవాలయాలు గో ఆధారిత ఉత్పత్తులు కొనుగోలు చేసేలా చూస్తామని గో శాలల నిర్వాహకులకు జవహర్రెడ్డి చెప్పారు. ప్రతి గ్రామంలో గో సంచార భూమి (మేత భూమి) ఏర్పాటు చేసే విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అలాగే కరువు పరిస్థితుల్లో టీటీడీ నుంచి గోవులకు దాణా, గడ్డి అందించే విజ్ఞప్తిని పరిశీలిస్తామని డాక్టర్ జవహర్ రెడ్డి వివరించారు. పంచగవ్య తయారీ, మార్కెటింగ్ లో జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న సంస్థలు, నిపుణులను పిలిపించి రైతులకు, గోశాల నిర్వాహకులకు శిక్షణ ఇప్పిస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, టీటీడీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి, ఇస్కాన్ తిరుపతి శాఖ అధ్యక్ష్యులు రేవతి రమణ దాస్, సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరాం, ఆయర్వేద వైద్యులు డాక్టర్ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.