విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీటీడీ కల్యాణమస్తు మరోసారి ప్రారంభానికి సిద్ధమైంది. వచ్చే నెల 7 వ రాష్ట్రమంతా సామూహికంగా కల్యాణమస్తు జరిపేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టారు. శుక్రవారం రేపటి నుంచి శ్రావణమాసం ప్రారంభం అవుతుండటంతో పెండ్లిళ్లకు ముహూర్తాలు ఖరారవుతుంటాయి. కల్యాణమస్తు పొందాలనుకునేవారు కల్యాణం తేదీ కంటే ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణమస్తు పథకం మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం ఖరారుచేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేదలు పెండ్లి చేసుకునేందుకు ఆర్థిక సాయం అందించేందుకుగాను 2007 లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి కల్యాణమస్తు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. టీటీడీ తరఫున నిర్వహించే ఈ కార్యక్రమంలో పెండ్లి చేసుకునే జంటకు బంగారు తాలిబొట్టు, పెండ్లి దుస్తులతోపాటు 50 మంది బంధువులకు భోజన ఏర్పాట్లు చేసేవారు. 2007 నుంచి 2011 వరకు రెండు విడతల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిచిపోయిన ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించేందుకు ఏపీ సర్కార్ నిశ్చయించింది. ఇందుకుగాను మార్గదర్శకాలను కూడా రూపొందించింది.
ఈ మార్గదర్శకాల ప్రకారం..
వధూవరుల ప్రస్తుత ఫొటోలు దరఖాస్తుతో పాటు జతపరచాలి. విడివిడిగా ఉన్న దరఖాస్తు కాలమ్లో వధూవరుల పూర్తి పేరు, వయస్సు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, వృత్తి, తల్లిదండ్రుల పేర్లు, కులం, గోత్రం, మతం, పూర్తి చిరునామాలను పొందు పరచాలి. సెల్ఫ్ డిక్లరేషన్ పత్రంలో తాము భారతీయ హిందువులని, వేంకటేశ్వరస్వామిపై పూర్తి భక్తివిశ్వాసాలు కలిగి ఉన్నామని, ఇద్దరం హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోదలిచామని కచ్చితంగా దరఖాస్తులో స్పష్టం చేయాల్సి ఉంటుంది.
ఈ నెల 31 నాటికి వధువుకు 18, వరుడికి 21 సంవత్సరాల వయసు ఉన్నట్లు ధ్రువపత్రాలు సమర్పించాలి. వివాహం నాటికి వధూవరులు మేజర్లమని, ఎలాంటి మానసిక సమస్యలు లేవని సగోత్రికులం కాదని స్పష్టం చేయాలి. వధూవరుల తల్లిదండ్రులు, పెద్దల అంగీకారంతోనే ఈ వివాహం చేసుకుంటున్నామని.. ఇంతకుముందు తమకు వివాహం కాలేదని సెక్షన్-8 హిందూ వివాహ చట్టం-1955 ప్రకారం రిజిష్టర్ చేయించుకునే బాధ్యత తమదని తెలియజేయాలి.