TTD | కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవ 2025 ఫిబ్రవరి మాసం కోటా టికెట్లను గురువారం ఆన్లైన్లో విడుదల చేసింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొనాలనుకునే భక్తులు టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవ, దర్శన కోటా టికెట్లను విడుదల చేయనున్నది. ఈ నెల 23న ఫిబ్రవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లను ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నట్లు చెప్పింది.
శ్రీవాణి ట్రస్టు టికెట్ల 23న ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు దర్శించుకునేందుకు వీలుగా ఫిబ్రవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని చెప్పింది. అదే రోజు తిరుమల, తిరుపతిలో మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని పేర్కొంది. భక్తులు ttdevasthanams.ap.gov.inలో శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.