తిరుమల : స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి సూచించారు. రద్దీ అధికంగా ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తతతో సేవలు అందించాలని ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవన్లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రద్దీ క్రమేపీ పెరిగే అవకాశం ఉన్నదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు సదుపాయాల కల్పనలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్యూ లోని భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గత కొన్ని నెలలుగా గురువారం నుంచి ఆదివారం వరకు భక్తుల రద్దీ విపరీతంగా ఉంటున్నదన్నారు. ఇందుకై ఆలయంలో, సన్నిధి నుండి వెండి వాకిలి, వెండివాకిలి నుంచి మహద్వారం వరకు అదనంగా అధికారులను నియమించి, షిఫ్ట్ల వారీగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రద్దీ రోజుల్లో రోజుకు 90 వేల మందికిపైగా దర్శనం చేసుకుంటున్నారని చెప్పారు. క్యూ లైన్ల నిర్వహణ లో టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యాధికారి తిరుమలలో పరిశుభ్రతతో పాటు భక్తులకు నిరంతరాయంగా తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రిసెప్షన్ అధికారులు గదుల కేటాయింపులో అలస్యం లేకుండా చూడాలన్నారు.
క్యూ లైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 , నారాయణ గిరి ఉద్యానవనంలో వేచి ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు తాగునీరు, అన్నప్రసాదాలు అందించాలని చెప్పారు. వాహనాల రాకపోకలతో ట్రాఫిక్కు సమస్య కలుగకుండా చూడాలన్నారు. కల్యాణకట్టలో నిత్యం దాదాపు 40 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారని, రద్దీ కి తగినట్లు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సమీక్షలో చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఈ 2 జగదీశ్వర రెడ్డి, వీజీఓ బాలిరెడ్డి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.