తిరుమల: తిరుమలలో (Tirumala) శ్రీవారి ఉచిత ధర్మరథం ఎలక్ట్రిక్ బస్సు (Electric bus) చోరీకి గురైంది. సాలకట్ల బ్రహ్మోత్సవాల వేళ దుండగుడు విద్యుత్ బస్సును ఎత్తుకెళ్లాడు. శనివారం రాత్రి చార్జింగ్ స్టేషన్ వద్ద బస్సుకు చార్జింగ్ పెట్టిన డ్రైవర్ ఎక్కడికో వెళ్లాడు. తిరిగి వచ్చి చూడగా బస్సు కనిపించకపోవడంతో అధికారులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మిస్సైన బస్సు కోసం గాలింపు చేపట్టారు.
జీపీఎస్ లొకేషన్ ఆధారంగా అది నాయుడుపేట వద్ద ఉన్నట్లు గుర్తించారు. బస్సులో చార్చింగ్ అయిపోవడంతో దుండగుడు ఆదివారం తెల్లవారుజామున 3.53 గంటలకు నాయుపేట బైపాస్ రోడ్డులో వదిలి వెళ్లాడు. కాగా, వారం రోజుల క్రితం కారు కనిపించకుండా పోయిన ఘటనపై కూడా ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి పోలీసులకు సమాచారం అందించలేదని తెలుస్తున్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు.