Tirupati | టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. వెంకటశివారెడ్డిపై హత్యాయత్నం కేసులో శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్త చంద్రారెడ్డి, మరో ఇద్దరిని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతి ఎన్జీవో కాలనీలో వెంకట శివారెడ్డి అనే వ్యక్తిపై ఈ నెల 25వ తేదీన హత్యాయత్నం జరిగింది. దుండగులు కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన వెంకటశివారెడ్డి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను వాంగ్మూలం ఇచ్చే పరిస్థితిలో లేకపోవడంతో ఘటనాస్థలిలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అందులో వెంకటశివారెడ్డిని అతని అపార్ట్మెంట్ ముందే ఇద్దరు వ్యక్తులు అడ్డగించి కత్తితో తలపై నరికినట్లుగా సీసీ టీవీలో ఫుటేజీలో కనిపించింది. అడ్డగించిన వారిలో ఒక మహిళ కూడా ఉంది. కానీ సీసీ టీవీ ఫుటేజిలో దాడి చేసిన వ్యక్తుల మొహాలు సరిగ్గా కనిపించలేదు. దీంతో వాళ్లు ఎవరై ఉంటారా? అని ఆరా తీయగా.. వెంకటశివారెడ్డి ఎదురు ప్లాట్లో ఉండే టీటీడీ ఈఈ శ్రీలక్ష్మి, ఆమె భర్త గిరీశ్ చంద్రారెడ్డి అని తెలిసింది. ఎదురెదురు ఫ్లాట్లలో ఉండటంతో పలు విషయాల్లో వీరి కుటుంబాల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెంకటశివారెడ్డిపై కక్ష పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టునట్లు వెల్లడైంది.