తిరుమల: తిరుమలలో పర్యావరణపరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు టీటీడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో భాగంగా సంపూర్ణంగా ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్ణయించింది. అందుకోసం తిరుమలలోని దుకాణాల నిర్వాహకులు బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగులు వినియోగించాలని ఆదేశించింది. ఇప్పటికే దుకాణాల నిర్వాహకులతో టీటీడీ అధికారులు సమావేశం నిర్వహించారు.
ప్లాస్టిక్ తో కలిగే అనర్థాలను వారికి వెల్లడించారు. తిరుమలలో పలు దుకాణాల్లో ప్లాస్టిక్ క్యారీబ్యాగులు, ప్యాకింగ్ కు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. వారికి మూడు నెలల గడువు ఇచ్చి, అందరూ ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ షాంపూ ప్యాకెట్లు కూడా విక్రయించరాదని, సబ్బులకు బయోడిగ్రేడబుల్ కవర్లు మాత్రమే వాడాలని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.