BR Naidu | కల్తీ నెయ్యి కేసులో పీకల్లోతు కూరుకుపోయిన వైసీపీ, హెరిటేజ్ కంపెనీపై ఆరోపణలు చేయడం దుర్మార్గమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. హెరిటేజ్ ఎప్పుడూ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదని తెలిపారు. ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగా కానీ నెయ్యి సరఫరాలో హెరిటేజ్ పాత్ర లేదని ఆయన స్పష్టం చేశారు. అబద్ధాన్ని పదే పదే చెబితే అది నిజమవుతుందనుకోవడం మీ భ్రమ. హెరిటేజ్ కంపెనీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదనేది నిప్పులాంటి నిజమని పేర్కొన్నారు.
మండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న బొత్స సత్యనారాయణ విషయాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. హెరిటేజ్ చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి అని చెప్పి మీ పరువు పోగొట్టుకున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ చెప్పినట్లు ఆడకుండా మాట్లాడే ముందు విజ్ఞతతో ఆలోచించాలని సూచించారు. నెయ్యి ధరలపైనా వైసీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓపెన్ టెండర్లలో పారదర్శకంగా వీటిని నిర్ణయించామని తెలిపారు. మా పాలకవర్గం రాగానే మొదటగా మేము స్వామి వారి అన్న ప్రసాదాల నాణ్యతలో రాజీపడకూదని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు.
తక్కువ ధరలకు సరుకులు కొని స్వామి వారికి నాణ్యత లేని నైవేద్యాలు, భక్తులకు అన్న ప్రసాదాలు అందించడం ఏంటని బీఆర్ నాయుడు ప్రశ్నించారు. ఈ విషయంలో మేం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నెయ్యి ఒక్కటే కాదు అన్ని రకాల పదార్ధాల్లోను నాణ్యతా ప్రమాణాలు పెంచామని తెలిపారు. స్వామివారికి సమర్పించే వాటిలో డబ్బు ఎంత ఖర్చు అవుతుందని లెక్కలు వేసుకోబోమని.. అయినా ఇదంతా ఆయన సొమ్మే అని అన్నారు. దేవదేవుని సొమ్ముని నైవేద్యాలకు, అన్న ప్రసాదాలకు వాడే అంశంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేది లేదని స్పష్టం చేశారు.