తిరుమల: భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని టీటీడీ (TTD) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) అన్నారు. తిరుమల మెట్ల మార్గంలోని నరసింహ స్వామి ఆలయం-ఏడో మైలు మధ్య అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కిందని తెలిపారు. రెండు నెలల్లో ఇది ఐదో చిరుత పులి అని చెప్పారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రత, భక్తుల క్షేమం విషయంలో టీటీడీ పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనన్నారు. అటవీశాఖ అధికారుల సహకారంతో, వారి నిరంతర పర్యవేక్షణలో అలుపెరగకుండా ‘ఆపరేషన్ చిరుత’ కొనసాగుతున్నదని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో నిరంతర కృషి జరుగున్నదని తెలిపారు.
ఇప్పటివరకు ఇద్దరు చిరుత పులి దాడికి గురైతే, అందులో ఒక పాప మరణించిందని, ఆ తర్వాత మరింత అప్రమత్తమై భద్రతా చర్యలను మరింత పటిష్టం చేశామన్నారు. నడకదారిలో వస్తున్న భక్తులను గుంపులు గుంపులుగా ప్రయాణించమనీ, వారితో పాటు తోడుగా సిబ్బందిని పంపి, ధైర్యాన్ని నింపే ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు. మరికొంతకాలం పాటు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మెట్ల మార్గంలో చిన్న పిల్లలు నడిచేందుకు అనుమతి నిరాకరించడం జరిగిందన్నారు. భక్తులకు భరోసా కల్పించేందుకే ఊతకర్రలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. తమపై విమర్శలు చేసినా భక్తుల భద్రతలో రాజీపడమని స్పష్టం చేశారు.