చిత్తూరు: తిరుమల, తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకున్నది. తమకు అందే సిఫార్సు లేఖలపై ఆర్జిత సేవా టికెట్ల ధరలను పెంచాలని నిర్ణయించారు. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను కోరుకునే భక్తులపై ఎక్కువ భారం వేయనున్నారు. ఆనంద నిలయానికి బంగారంతో తాపడం చేయించాలని, అలాగే అన్నమయ్య నడక మార్గాన్ని అభివృద్ధి చేయాలని, అలిపిరి వద్ద ఆధ్యాత్మిక నగరాన్ని నిర్మించేందుకు బోర్డు నిర్ణయించింది.
టిటిడి ధర్మకర్తల మండలి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశమైన బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఈ సందర్భంగా 2022-23 వార్షిక సంవత్సారానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్కు బోర్డు ఆమోదం తెలిపింది. రూ.3,171 కోట్లతో బడ్జెట్కు రూపకల్పన చేశారు. సిఫార్సు లేఖలు తీసుకువచ్చే భక్తుల విషయంలో టీటీడీ బోర్డు కఠిన నిర్ణయాలు తీసుకున్నది. ఒక్కో సేవపై ఇప్పుడున్న టికెట్ ధరలను 10 రెట్లు పెంచుతూ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టగా బోర్డు ఆమోదించింది. సుప్రభాతం రూ.2 వేలు, తోమాల, అర్చన రూ.5 వేలు, కల్యాణోత్సవం రూ.2500, వేద ఆశీర్వచనం ధరలను రూ.10,500 కు పెంచాలని బోర్డు పెద్దలు నిర్ణయించారు.
శ్రీవారి ఆనంద నిలయానికి బంగారం తాపడం చేయించే పనులు చేపట్టాలని బోర్డు నిర్ణయించింది. దీనికి కూడా బోర్డు ఆమోదించింది. అన్నమయ్య మార్గంలో నడక మార్గంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే, అలిపిరి వద్ద ఆధ్మాత్మిక నగరాన్ని నిర్మించేందుకు బోర్డు తీర్మానించింది. ఇక్కడ సైన్స్ సిటీ నిర్మాణానికి కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటున్న నేపథ్యంలో అక్కడే 50 ఎకరాల స్థలంలో ఆధ్యాత్మిక సిటీని నిర్మించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది.