Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో భారీ సంఖ్యలో భక్తులు( Devotees ) తరలివచ్చారు. వైకుంఠం 1, 2 కాంప్లెక్సులు భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి షెడ్లు కూడా నిండిపోయాయి. దీంతో క్యూలైన్ గోగర్భం జలాశయం వరకు చేరుకుంది. భక్తులు బయట కిలోమీటర్ల మేర బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం పడుతోంది.
అలిపిరి నుంచి మెట్ల మార్గంలో కూడా భక్తులు భారీగా కొండపైకి వస్తున్నారు. భక్తులు భారీగా తరలివస్తున్న దృష్ట్యా.. టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు మంచినీళ్లను, అన్నప్రసాదాలను శ్రీవారి సేవకుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఒకేసారి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో అద్దె గదులు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.