KTR | కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు ఇవ్వాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం లేదని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన నామమాత్రంగా ఉందని, కేవలం దృష్టి మరల్చే చర్య అంటూ విమర్శించారు. కేవలం అదానీకి ఛత్తీస్గఢ్, ఒడిశాలోని బైలడిల్లా గనులను అక్రమ కేటాయింపుల నుంచి దృష్టి మరల్చేందుకు చేస్తున్న కుట్ర అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతంపై చిత్తశుద్ధి ఉంటే దానికి వెంటనే డెడికేటెడ్ క్యాప్టివ్ ఐరన్ఓర్ గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ప్లాంట్తో పాటు తెలంగాణ ప్రజల హక్కు అయిన బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గొడ్డలిపెట్టుగా మారిన అదానీ బైలడిల్లా ఇనుప ఖనిజ గనుల కేటాయింపు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కుట్రపూరిత వైఖరిని తాము బయట పెట్టిన నేపథ్యంలోనే కేంద్రం కొత్త డ్రామాకు తెరలేపిందని ధ్వజమెత్తారు.
‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ అన్న తీరుగా అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్తో పాటు ఖమ్మం బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పాతర వేసేలా కేంద్రం కుట్రలు చేసిన తీరుపైనా బీఆర్ఎస్ నిరంతరం ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునే విషయంలో చిత్తశుద్ధిని చాటుకుంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ జారీ చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పాల్గొంటామని చేసిన ఒక ప్రకటన నేపథ్యంలోనే కేంద్రం వెనకి తగ్గిందని కేటీఆర్ అన్నారు. ‘కేసీఆర్ ఒక మాట మాట్లాడితే ఎవరైనా దిగి రావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది’ అని కేటీఆర్ అన్నారు. అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా విరమించుకునే దాకా, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేసే దాకా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి పెంచుతూనే కేటీఆర్ స్పష్టం చేశారు.