Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు త్రయోదశి సందర్భంగా బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రదోషకాల సమయంలో నందిమండపంలోని శనగల బసవన్నకు పంచామృతాభిషేకాలు జరిపించారు. నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు.
వివిధ ప్రాంతాల నుండి క్షేత్రానికి వస్తున్న వారు ముందస్తుగా ఆన్లైన్లో వసతి గదుల కేటాయింపు చేసుకుని ఆలయ సిబ్బందికి సహకరించాలని శ్రీశైలం ఈవో లవన్న కోరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లను చేసి స్వామి అమ్మవార్ల దర్శనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉభయ దేవాలయాలతోపాటు హఠకేశ్వరం, ఫాలధార పంచధార, సాక్షి గణపతి, శిఖరేశ్వర ఆలయాలు భక్తులతో సందడి సందడిగా మారాయి.
అత్యంత మహిమాన్వితమైన శివానుగ్రహం పొందడానికి చిత్తశుద్ధి కలిగిన ప్రేమతో శివారాధన చేయాలని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నర్సింహారావు అన్నారు. తలచిన వెంటనే అనుగ్రహించే తత్వం పరమ శివుడిదని చెప్పారు. బుధవారం శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చిన గరికపాటి దంపతులకు ఆలయ ప్రధాన ద్వారం వద్ద అర్చక వేద పండితులతో కలిసి ఈవో లవన్న ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీభ్రమారంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను గరికపాటి దంపతులు దర్శించుకుని ఉభయ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
ఆ తరువాత ఆలయ మాడవీధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శివానందలహరి విశేషాలను భక్తులకు గరికపాటి వివరించారు. జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లిఖార్జున స్వామి, మహాశక్తి స్వరూపిణి అయిన శ్రీభమరాంబికా దేవి స్వయంగా వెలిసిన శ్రీశైల దివ్యక్షేత్రం మహామాన్వితమైందని గరికపాటి పేర్కొన్నారు.శివానుగ్రహప్రాప్తి పొందడం ఎంతో సులభమని పేర్కొన్నారు. పరమ శివుడి శిరస్సుపై దోసెడు నీళ్లు పోసి, కాసిన్ని మారేడు దళాలు వేసిన వారి ఇండ్లలో కామధేనువు పెంపుడు గోవుగా తిరుగాడుతుందన్నారు. కల్పవృక్షం వారింటి పెరటి మల్లె చెట్టుగా మారుతుందనని చెప్పారు. కల్పవృక్షం, కామ ధేనువు మనం కోరినవన్నీ ఇస్తాయన్నారు.
వేల సంవత్సరాలుగా మునులు, ఋషులు సాధకులకు అనువైన క్షేత్రం శ్రీశైలం అని గరికపాటి పేర్కొన్నారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కల ఏకైక క్షేత్రానికి దేశ విదేశాల నుండి వస్తున్న యాత్రికులు చెంబెడు నీళ్లతో పరమ శివుడికి అభిషేకం చేసుకునే అవకాశం కల్పించాలని దేవస్థానం అధికారులకు సూచనలు ఇచ్చారు. పరమ శివుడ్ని ఆనందింపజేసే నిగూఢాలను తెలిపేదే శివానందలహరి అని భక్తుల సందేహాలనూ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో లవన్న, అర్చక స్వాములు, వేద పండితులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.