అమరావతి : ఆంధ్రప్రదేశ్లో విషాదఘటన చోటు చేసుకుంది. పిడుగుపడి నలుగురు దుర్మరణం చెందారు. ఏలూరు జిల్లాలో జరిగిన ఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి, దేవుడి అన్నవరం నుంచి వచ్చిన కూలీలు ఏలూరు జిల్లాలోని లింగపాలెం మండలం బోగోలులో జామాయిల్ కర్రల నరికివేతకు వచ్చి గుడారాలు వేసుకున్నారు.
నిన్న అర్ధరాత్రి వర్షాలు కురిసిన అనంతరం ఒక గుడారంపై పిడుగుపడి నలుగురు చనిపోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతదేహాలను, క్షతగాత్రులను ఏలూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కొండబాబు(32), ఆర్.రాజు(30), ధర్మరాజు(26), శ్రీనివాస్(20) అనే యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి శవ పంచనా మా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.