Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా సొంత వాహనాల్లో వస్తున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం వచ్చే భక్తులకు నంద్యాల జిల్లా ఎస్పీ కే.రఘువీర్ రెడ్డి పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు తప్పనిసరిగా అనుభవం ఉన్న డ్రైవర్ను వెంట తీసుకుని వెళ్లాలని సూచించారు. డ్రైవింగ్ అనుభవం లేని వారు డ్రైవింగ్ చేయడం వల్ల వాహనాల క్లచ్ ప్లేట్ పోయి వాహన ప్రయాణం మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉందని తెలియజేశారు. ఘాట్ రోడ్డులో వాహనాలను ఓవర్ టేక్ చేయరాదని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
➣ మోటార్ సైకిల్పై వచ్చే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనాలను ఎక్కడ పడితే అక్కడ నిలుపరాదని హెచ్చరించారు.
➣ ఇతర వాహనదారులకు అసౌకర్యం కలిగించేలా వాహనాలు పార్కింగ్ చేయరాదని.. పోలీసులు సూచించిన పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలను నిలపాలన్నారు.
➣ సాక్షి గణపతి వద్దకు కాలినడకన వెళ్లి దర్శనం చేసుకోవాలి. కానీ వాహనాలు నిలుపుకుని దర్శనం చేయరాదని హెచ్చరించారు. వాహనాలను ఎక్కువసేపు ఆపడం వల్ల ట్రాఫిక్జామ్ జరుగుతుంది. కాబట్టి భక్తులు గమనించి సహకరించాలని కోరారు.
➣ సాక్షి గణపతి గుడి నుంచి మెయిన్ టెంపుల్ వరకు రోడ్లపైన ఎక్కడ వాహనాలను నిలపరాదు. వాటికి కేటాయించిన స్థలంలోనే నిలపవలెను.
➣ వాహనాలను ఘాట్ రోడ్డులో ఓవర్ టేక్ చేయరాదు.. ఓవర్లోడ్తో వెళ్లరాదు.
➣ సరుకులు అమ్మే వాళ్ళు ఘాట్ రోడ్డులో ఎక్కడ ఉండకూడదు.
➣ మహాశివరాత్రి రోజు రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు దోర్నాల నుంచి పైకి శ్రీశైలం వైపు ఏ వాహనాలు అనుమతించబడవు.
➣ పాతాళగంగ ఘాట్ల దగ్గర స్నానం ఆచరించడానికి వచ్చే భక్తులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా గజ ఈతగాళ్లను నియమించామని తెలియజేశారు.
➣ ఏపీకి చెందిన వాహనాలను APSRTC బస్టాండ్ ప్రాంతంలో, తెలంగాణ, కర్ణాటకకు చెందిన వాహనాలను మేకల బండ వెనక ప్రాంతంలో, టూరిస్ట్ వాహనాలను మేకల బండ పక్కన గల ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసుకోవాలి.
➣ కార్లు టెంపుల్ వెనక భాగంలో, ఓల్డ్ హెలీప్యాడ్, స్కూల్, నిత్య అన్నదాన పక్కన పార్కింగ్ చేసుకోవాలి.
➣ పై నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.