అలంపూర్ చౌరస్తా, అక్టోబర్ 16 : ఏపీలోని కర్నూల్ జిల్లాలో గురువారం ప్రధాని మోదీ (Modi Srisailam Tour) పర్యటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేయడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు 20 కిలోమీటర్ల మేర అటు ఏపీలోని కర్నూల్ వైపు.. ఇటు తెలంగాణలోని ఉండవెల్లి మండలం పుల్లూరు నుంచి అలంపూర్ చౌరస్తా వరకు హైవే-44పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
దాదాపు 5 గంటలపాటు వాహనాలు క్యూకట్టాయి. హైదరాబాద్ నుంచి కడప, బెంగళూరు, నంద్యాల, తిరుపతి, అనంతపూర్కు వెళ్లే వాహనాలను అలంపూర్ మీదుగా వంతెన ద్వారా ఏపీకి మళ్లించారు. కర్నూల్ వైపు నుంచి వచ్చే వాహనాలను నిలిపివేశారు. తర్వాత రాత్రి వరకు ట్రాఫిక్ను పోలీసులు క్లియర్ చేశారు. పుల్లూరు నుంచి మానవపాడు మండలం వరకు జాతీయ రహదారిపై వేల సంఖ్యలో ఆటోలు, ట్రాలీ ఆటోలు, లారీలు, బస్సులు బారులుతీరాయి. ప్రయాణికులు, చిన్నపిల్లలకు తాగేందుకు నీళ్లు కూడా దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేసేదేమీ లేక కొందరు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి హోటళ్లలో భోజనం, స్నాక్స్ తిని ఆకలి తీర్చుకున్నారు.