అమరావతి : ఏపీలో ఎన్నికల షెడ్యూల్ (Election schedule) ఖరారయ్యింది. రాష్ట్రంలోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల ఓటర్లు (Women Voters) ఉండగా, వీరిలో 2 కోట్ల మంది పురుషులు, 2.07 కోట్ల మంది మహిళా ఓటర్లు, 3,482 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 67,434 మంది సర్వీస్ ఓటర్లు, 7,603 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారు.
రాష్ట్రంలో మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాలు ఉండగా, సగటున ఒక్కో పోలింగ్ స్టేషన్కు 887 ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. లోక్సభ , అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు(Elections) జరుగనున్నాయి, మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. నామినేషన్లను ఏప్రిల్ 18 నుంచి 25వ తేదీ వరకు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 26న నామినేషన్లను పరిశీలించనున్నారు.
నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 చివరి తేదీ విధించారు. మే 13న ఎన్నికలు నిర్వహించి, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రంలో మొత్తం 29 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 4 ఎస్సీ, ఒక ఎస్టీ రిజర్వ్డ్ లోక్సభ స్థానాలు ఉన్నాయని వెల్లడించింది.