విజయనగరం: ఒకవైపు దేశమంతా ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటుండగా.. మరోవైపు ఆదివాసీలు తమ సమస్యల పరిష్కారం కోసం గళం విప్పేందుకు ఇదే రోజును ఎంచుకున్నారు. ప్రభుత్వం దృష్టిని ఆకర్శించేందుకు నిరసన చేపట్టారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో దారపర్తి, బొడ్డవర, రేగ పుణ్యగిరి తదితర గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో దాదాపు 4 లక్షల గిరిజన జనాభా ఉన్నది. విద్యాబుద్ధులు అందకపోవడం వల్ల వారు ఇంకా పాతకాలం ఆదివాసీలుగానే మగ్గుతున్నారు.
సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల తాము నరకాన్ని ఇక్కడే అనుభవిస్తున్నామని శృంగవరపుకోట మండలం పరిధిలోని గిరిజనులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యం అందుబాటులో లేకపోవడంతోపాటు, అంబులెన్సులు మూలకు పడటంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు నినదించారు. డోలీ మోతలను నిలువరించేలా ఇక్కడి మంత్రి బొత్స సత్యనారాయణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. శృంగవరపుకోటలో మినీ ఐటీడీఏ ఏర్పాటుచేసి తమ బ్రతుకులను మార్చాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి సోమవారం తమ సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ గ్రీవెన్స్ డే నిర్వహించాలని వారు సూచించారు.