విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు ఆ ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు గత కొన్నాళ్లుగా ఆందోళన చేపడుతున్నారు. దీక్షలు, మౌన ప్రదర్శనలు, అర్ధనగ్న ప్రదర్శనలు, నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు, రైల్రోకోలు.. ఇలా ఎన్నో రకాలుగా తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇవేవీ కేంద్ర ప్రభుత్వం చెవికి ఎక్కకపోవడంతో.. వారు తమ ఆందోళనలను కొత్త పంథాలో నిర్వహించాలని నిర్ణయించారు.
ఇప్పటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ) ఉద్యోగులు, ట్రేడ్ యూనియన్ నాయకులు ప్రత్యక్షంగా నిరసనల ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఇప్పుడు డిజిటల్ మార్గాన్ని ఎంచుకున్నారు. డిజిటల్ నిరసనలో భాగంగా ఉద్యోగులు, ఆందోళనకారులు, కార్మిక సంఘాల నాయకులు, వివిధ సంస్థల ప్రతినిధులు, సాధారణ ప్రజలు.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని ఉపసంహరించుకోవాలంట్లూ కేంద్ర ఉక్కు మంత్రి రామ్చంద్రప్రసాద్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. అలాగే, వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా కూడా కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు పంపుతున్నారు.
ఈ డిజిటల్ ప్రచారాన్ని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ (వీయూపీపీసీ) ప్రారంభించింది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వీయూపీపీసీ అనేక విధాలుగా నిరసనలు చేపడుతున్నది. వీయూపీపీసీ సభ్యులు అయోధ్యరామ్, డీ ఆదినారాయణ, వరసాల శ్రీనివాస్రావు, గంధం వెంకట్రావు తదితరులు ఈ డిజిటల్ ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ, 25 కిలోమీటర్ల పాదయాత్ర, ఆమరణ దీక్షలు చేపట్టారు. ఒక్క బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటనికి మద్ధతుగా నిలిచాయి.