తిరుమల : ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం నుంచి సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదనను ప్రారంభించారు. జనవరి 14వ తేదీ వరకు తిరుప్పావై పారాయణం కొనసాగుతుందని టీటీడీ వేదపండితులు తెలిపారు. ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థించారని పురాణాలు చెబుతున్నాయని పేర్నొన్నారు.
12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్(గోదాదేవి) ఒకరని ఆమె వేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారని వెల్లడించారు. నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు స్వామివారికి నివేదిస్తారని తెలిపారు. ఈ సందర్భంలో భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారని అన్నారు. పవిత్ర ధనుర్మాసం సందర్భంగా పెద్దజీయర్ మఠంలో తిరుప్పావై పారాయణం శనివారం ప్రారంభమైంది. పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.