Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో ధనుర్మాసం కీలకమైంది. ఈ నెల 16 నుంచి ధర్మాసం ప్రారంభం కానున్నది. ఆ రోజు ఉదయం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు మొదలవనున్నాయి. జనవరి 14 వరకు ధనుర్మాస ఘడియలు ముగుస్తాయి. ఈ క్రమంలో 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహించనున్నారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతి రోజూ స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోశ, బెల్లం దోశ, సుండలు, సీరా, పొంగల్ తదితర ప్రసాదాలను నివేదిస్తారు.
పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నది. 12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్(గోదాదేవి) ఒకరు. ఆమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. వేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.