తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కంపార్టుమెంట్లో వేచి యున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ(Ttd) అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 53,755 మంది భక్తులు దర్శించుకోగా 18,267 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi income) రూ. 4.74 కోట్లు వచ్చిందని వివరించారు.
సాయంత్రం ఆర్జిత సేవా టికెట్ల విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి మార్చి, ఏప్రిల్, మే నెలల కోటాను ఈరోజు సాయంత్రం 4 గంటలకు టీటీడీ ఆన్లైన్(Ttd online) లో విడుదల చేయనుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉన్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన మిగతా ఆర్జితసేవా టికెట్లకు ఆన్లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యింది. ఈనెల 24 ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. భక్తులు ఈ విషయాలను గుర్తించి శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని కోరారు.