తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోగా కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తులు క్యూలో నిలబడ్డారు. నిన్న శ్రీవారిని 66,977 మంది భక్తులు దర్శించుకోగా 33,020 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు వచ్చిందన్నారు.
జూలై 10 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
తిరుపతిలోని రైల్వేస్టేషన్ వెనుక గల గోవిందరాజస్వామి సత్రాల్లో జూలై 10 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జరుగనుందని ఆలయ అధికారులు వివరించారు. మూడు రోజుల పాటు ఉదయం భజన మండళ్లతో సుప్రభాతం, సామూహిక భజన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. సాయంత్రం సంగీత విభావరి, ప్రవచన కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. 10వ తేదీన సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి మూడో సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తామన్నారు.