తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 14 కంపార్ట్మెంట్లలో ( Compartments) వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 73,879 మంది భక్తులు దర్శించుకోగా 26,144 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income ) రూ. 4.05 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
ఆగస్టు 17న వాచీలు టెండర్ కమ్ వేలం
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను ఆగస్టు 17న టెండర్ కమ్ వేలం వేయనున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇందులో హెచ్ఎంటీ, సీకో, సిటిజన్, టైమ్స్, సోని, టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్వెల్, ఫాస్ట్ట్రాక్ కంపెనీల వాచీలున్నాయి. కొత్తవి, ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 14 లాట్లు వేలంలో ఉంచామని తెలిపారు.