తిరుమల : తిరుమలలో ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank Of India) ఎండీ, సీఈవో మతం వెంకటరావు, హైదరాబాద్ జోనల్ హెడ్ ధరసింగ్ నాయక్తో కలిసి రూ. కోటిని ( One Crore ) అందించారు. శుక్రవారం తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో (TTD EO) ఏవీ ధర్మారెడ్డికి డీడీని అందజేశారు.
బ్రహ్మోత్సవాల భద్రతపై సమీక్ష
తిరుమలలో సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Brahmotsavams ) , అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు జరుగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల భద్రత (Security ) ఏర్పాట్లపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. టీటీడీ సీవీ ఎస్వో నరసింహ కిషోర్, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తిరుమల అన్నమయ్య భవనంలో పోలీసు, విజిలెన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం రోజున సీఎం జగన్ పర్యటన, గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం లాంటి విశేషమైన రోజుల్లో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. బ్రహ్మోత్సవాలకు వాహనాల్లో వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ప్రదేశాలకు సూచిక బోర్డుల ఏర్పాటుతోపాటు అదనంగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.