తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో కొండపై ఉన్న కంపార్టుమెంట్ల (Compartments) లో 7 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 75,776 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 22,700 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
ఆగస్టు 22 నుంచి 26వ తేదీ వరకు కారీరిష్టి యాగం
దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ ఆగస్టు 22 నుంచి 26వ తేదీ వరకు కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమాలను నిర్వహించనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో 32 మంది వేద, శ్రౌత, స్మార్థపండితులు యాగ కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించారు.