Tirumala | వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానంపై తిరుమలలో కేసు నమోదైంది. సిఫారసు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించి ఆరు టికెట్లను విక్రయించారని ఓ భక్తుడి ఇచ్చిన ఫిర్యాదుతో తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు.
బెంగళూరుకు చెందిన సాయికుమార్ అనే వ్యక్తికి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను వైసీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అధిక ధరకు విక్రయించారు. వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం సిఫారసు లేఖపై అతనికి ఆరు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను అమ్మారు. అయితే ఈ టికెట్ల కోసం రూ.65వేలు తీసుకున్నారు. దీనిపైనే సాయికుమార్ అనే వ్యక్తి టీటీడీ అధికారులకు ఫిర్యదు చేశాడు. విచారణలో బ్లాక్లో వీఐపీ టికెట్లు విక్రయించినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులకు టీటీడీ విజిలెన్స్ వింగ్ ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ జకియా ఖానం, ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్వో కృష్ణతేజ పేర్లను చేర్చారు.
తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను బ్లాక్లో విక్రయించారని తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్సీ జకియా ఖానం స్పందించారు. తాను టీడీపీ చేరబోతున్నాని తెలుసుకుని వైసీపీ నేతలు తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. అందులో భాగంగానే తన లెటర్ను దుర్వినియోగం చేశారని అన్నారు. తన లెటర్ను డబ్బులకు ఇచ్చిన విషయం తెలియదని అన్నారు. పోలీసులు సమాచారం ఇవ్వడం వల్లే ఈ విషయం తనకు తెలిసిందని తెలిపారు. నిజాయితీగా ఉండేవారికి వైసీపీలో గౌరవం లేదని ఆరోపించారు.