హైదరాబాద్ : తిరుమల(Tirumala ) శ్రీవారి ఆలయం సమీపం నుంచి తరుచూ విమానాలు చక్కర్లు కొడుతుండడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మరోసారి విమానాలు శ్రీవారి ఆలయం సమీపంలోని గగనతలం నుంచి వెళ్లాయి. ఆగమశాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయంపై విమానాలు(planes), హెలికాప్టర్లు(Helicopters) ఎగరడం నిషిద్ధం. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావటంతో టీటీడీ అధికారులు(TTD) పలుసార్లు పౌర విమానయాన శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారు.
అయినా కేంద్రం స్పందించటం లేదు. కొంత కాలంగా తరచూ శ్రీవారి ఆలయం, వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం మీదుగా విమానాలు వెళ్లటంపైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వారం వరుసగా ఒకే రోజు మూడు విమానాలు శ్రీవారి ఆలయం మీదుగా వెళ్లాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు.
తిరుమలకు ఉన్న ప్రత్యేకత, విశిష్ఠత కారణంగా నో ఫ్లయింగ్ జోన్లోకి తీసుకురావాలని ప్రతిపాదించినా కేంద్రం(Union Government) నుంచి సానుకూల స్పందన రాలేదు. ఈ నిబంధన అమలు చేయటం వీలుకాదని ఆశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. తరుచూ తిరుమల మీదుగా విమానాలు, హెలికాప్టర్లు వెళ్లిన సమయంలో టీటీడీ అధికారులు విమానయాన శాఖకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటు చేతులు దులిపేసుకుంటున్నారు.
కాగా నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్(Octopus) భద్రతా సిబ్బందితో పహారా ఏర్పాటు చేశారు. గగనతలంలో మాత్రం సమస్యగా మారుతోంది. కేంద్రం స్పందించి ఆలయం సమీపంలో విమానాల రాకపోకలపై నిషేదం విధించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.