తిరుమల : తిరుమల(Tirumala)కు వచ్చే అన్ని ఆర్టీసీ బస్సుల్లోనూ గార్బేజ్ బ్యాగులు(Garbage Bags) ఏర్పాటుచేసి ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో(Ttd EO) ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శనివారం సీనియర్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఘాట్ రోడ్లు, నడకదారుల్లో రోడ్డుకు ఇరువైపులా ప్లాస్టిక్ వ్యర్థాల(Plastic wastage)ను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు.
తిరుపతి రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న శ్రీనివాస సేతు(Srinivasa Setu) పనులను పూర్తి చేసేందుకు రైల్వే అధికారులు, స్మార్ట్ సిటీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని చీఫ్ ఇంజినీర్ను ఆదేశించారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం పనులను నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. నెయ్యి ప్లాంట్ యంత్రసామగ్రి ఏర్పాటు, ఇతర పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్, గోశాల అధికారులకు సూచించారు.
స్విమ్స్ ఆసుపత్రి( Svims Hospital)లో పెండింగులో ఉన్న ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ పనులను, టీటీడీ పరిధిలోని అన్ని ఆసుపత్రుల్లో రోగులకు, సిబ్బందికి నాణ్యమైన ఆహారం అందించేందుకు క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జేఈవోలు సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్ కుమార్, ఎఫ్ఏసీ ఏవో బాలాజీ, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, స్విమ్స్ ఉపకులపతి డాక్టర్ వెంగమ్మ, వేదవర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శేష శైలేంద్ర పాల్గొన్నారు.