తిరుమల : తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 9 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 69,529 మంది భక్తులు దర్శించుకోగా 29,227 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు వచ్చిందని తెలిపారు.
శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురవాలి : టీటీడీ చైర్మన్
ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం కారీరిష్టి-వరుణ జపం- పర్జన్యశాంతి హోమం నిర్వహించామని శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి (Karunakar Reddy) తెలిపారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో ఐదు రోజుల పాటు జరిగిన యాగాలు శనివారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఆయన మాట్లాడుతూ వరుణదేవుని ఆశీస్సులు కోరుతూ 32 మంది ఋత్వికులు ధర్మగిరిలో ఎంతో నిష్టగా, అత్యంత అంకితభావంతో యాగాలు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.