అమరావతి : ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు విశాఖపట్నం ( Visakapatnam) వైఎస్సార్ ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనున్న ఇండియా(India), ఇంగ్లండ్ (England రెండో టెస్టుకు ఆన్లైన్(Online) లో టికెట్ల విక్రయం సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. నాలుగేళ్ల తర్వాత విశాఖలో మ్యాచ్ జరగడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్కు ఏర్పాట్లను ప్రారంభించింది.
26 నుంచి ఆఫ్లైన్(Offline)లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయని నిర్వాహకులు వెల్లడించారు. ఆఫ్లైన్లో టికెట్లను ఏసీఏ విడిసిఏ స్టేడియంతో పాటు స్వర్ణభారతి స్టేడియంలో విక్రయించనున్నామని వివరించారు. అంతేకాకుండా ప్రతి రోజు 2వేల మంది విద్యార్థులకు(Students) మైదానంలోకి ఉచిత ప్రవేశం కల్పించనున్నామని తెలిపారు. మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే దేశ, విదేశీ అభిమానులకు చిన్నపాటి అసౌకర్యం కూడా కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
మూడంచెల పటిష్ట భద్రతతో పాటు తాగునీరు, మెడికల్ సదుపాయాలు, తగినన్ని స్టాల్స్ ఏర్పాటు చేస్తామని, ఉల్లాసభరిత వాతావరణం లో మ్యాచ్ చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈసారి పూర్తిగా డిజిటల్ టికెట్లను అందించనున్నట్లు వివరించారు. రూ.100, రూ. 200, రూ. 300, రూ.500 టికెట్లను ప్రతి రోజుకు విడివిడిగా విక్రయిస్తామని తెలిపారు. మొత్తం ఇంగ్లాండ్తో ఐదు టెస్టు మ్యాచ్ల సీరిస్గాను తొలి టెస్టు ఈనెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్(Hyderabad) లోని ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) లో జరుగనుంది . మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు రాజ్కోట్లో, నాలుగో టెస్టు ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు రాంచీలో, ఐదో టెస్టు మార్చి 7 నుంచి 11 వరకు ధర్మశాల స్టేడియంలో జరుగనుంది .