చిత్తూరు జిల్లాలో అమానుషం జరిగింది. ప్రియుడిని బెదిరించి.. అతని కళ్లెదుటే ప్రియురాలిపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. గత నెల 25వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, అత్యాచారానికి పాల్పడినవాళ్లు టీడీపీ కార్యకర్తలు కావడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా మూరకంబట్టు సమీపంలోని నగరవనంలో ప్రేమికులు, సామాన్య ప్రజలు సేద తీరుతుంటారు. ఇలా గత శనివారం నాడు ఓ ప్రేమికుల జంట సరదాగా మాట్లాడుకునేందుకు నగరవనం వచ్చారు. అయితే వీరిని టీడీపీ కార్యకర్తలైన ముగ్గురు యువకులు హేమంత్, మహేశ్, కిశోర్ టార్గెట్ చేశారు. ఆ ప్రేమ జంట వద్దకు వెళ్లిన యువకులు తమను ఫారెస్ట్ సిబ్బందిగా పరిచయం చేసుకున్నారు. ఆ ప్రేమ జంట సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు తీసి వాళ్ల తల్లిదండ్రులకు పంపిస్తామని బెదిరించారు.
ఆ ముగ్గురులో ఒకరు ప్రేమజంటలోని అబ్బాయిని “మా మేడమ్ మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారని’’ దూరంగా పిలుచుకొని వెళ్లగా మరో ఇద్దరు ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ అమ్మాయి కేకలు వేయగా ఒకడు నోరు నొక్కి పట్టుకోగా , మరొకడు అత్యాచారం చేశాడు. ఇలా ముగ్గురు మార్చి మార్చి ఆ బాలికను రేప్ చేశారు. అక్కడి నుంచి వెళ్లే సమయంలో బాలుడి మెడలోని గోల్డ్ చైన్ను లాక్కెళ్లిపోయారు. ఈ విషయాన్ని ప్రేమజంట తమ కుటుంబసభ్యులకు చెప్పారు.
దీంతో బాలిక స్వగ్రామం బండపల్లి వారికి తెలిసి నగరవనం దగ్గర కాపుకాశారు. నిన్న మధ్యాహ్నం ఆ కామాంధులను గుర్తించి ఆ ముగ్గురికి దేహశుద్ధి చేయగా ఒకడు తప్పించుకొని పారిపోయాడు. మిగిలిన ఇద్దరిని చిత్తూరు తాలూకా పోలీసులకు అప్పగించారు. కానీ.. నిందితులు టీడీపీకి చెందిన వారే కావడంతో రాజీ కోసం టీడీపీ కార్పొరేటర్ నవీన్ కుమార్ రంగంలోకి దిగి బెదిరింపులకి దిగాడు. దాంతో బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టేందుకు వెనకడుగు వేశారు. ఈ సాకుతో పోలీసులు చేతులు దులుపుకునేందుకు యత్నించారు. అయితే ఈ విషయం సోషల్మీడియాలో వైరల్ కావడంతో బాధితురాలి ఇంటికెళ్లిన పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం ఆమెను చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలోని వన్ స్టాఫ్ సెంటర్ తరలించారు. బాధితురాలు మైనర్ కావడంతో గ్యాంగ్ రేప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పోక్సో కేసు పెట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. ఈ కేసుకు రాజకీయ రంగులు పులమొద్దని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేయవద్దని కోరారు.