రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ రేపు తొలి సమావేశం కానున్నది. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు వర్చువల్గా జరుగనున్నది. సమావేశానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షత వహించనున్నారు. కాగా, సభ్యులుగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్లు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
ఈ కమిటీ సమావేశంలో ఏపీఎస్ఎఫ్సీ విభజన, రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ సమస్యలు, పన్నుల వ్యవహారం, వనరు వ్యత్యాసాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి గ్రాంట్పై చర్చించాలని తొలుత ఎజెండా సిద్ధం చేశారు. ఎజెండాలో తొలుత మొత్తం 9 అంశాలను చేర్చిన కేంద్ర హోం శాఖ.. తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఎజెండా నుంచి తొలగించారు. దీంతోపాటు మరో మూడు అంశాలను కూడా తొలగించారు. వీటిపై కూడా దుమారం రేగుతున్నది. ఇప్పటివరకు కేంద్రం దృష్టికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు సమస్యల్లో ఒక్కటైనా ఎజెండాలో పెట్టలేదు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణపై మరోసారి తమ అక్కసు వెళ్లగక్కేందుకు కేంద్రం కుట్రపన్నుతున్నట్లుగా అర్ధమవుతున్నది.
రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ఈ కమిటీ భేటీ మార్గం చూపుతుందని కేంద్ర హోంశాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. విభజన జరిగి ఎనిమిదేండ్లు కావస్తున్నా తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉన్నాయ. కాగా, త్రిసభ్య కమిటీ భేటీకి ముందే ఏపీకి ప్రత్యేక హోదా అంశం తొలగింపుపై ఏపీలో అగ్గిరాజుకున్నది.